ఏడంతస్థుల భవనంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి.. అపార్ట్‌మెంట్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు సజీవదహనమయ్యారు. డజన్ల మంది గాయపడగా.. వీరిలో పలువురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘోర ప్రమాదం దేశ ఆర్ధిక రాజధాని నగరం ముంబయి శివారులో చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రుల్లో మహిళలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం రెండు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.


మహారాష్ట్రలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబయి నగరంలోని గోరెగావ్‌‌‌లో ఓ ఏడంతస్తుల భవంతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. వీరిలో ఇద్దరు మైనర్లు. 28 మంది మహిళలు సహా మొత్తం 40 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ముంబయిలోని హెచ్‌బీటీ, కాపర్ ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు. వీరిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

గోరేగావ్‌కు పశ్చిమాన ఆజాద్ నగర్ ప్రాంతంలోని జై భవానీ అపార్ట్‌మెంట్ భవనంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం భవనమంతా వ్యాపించాయని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఘటనా స్థలికి ఐదు అతిపెద్ద వాటర్ ట్యాంకులు, భారీ టేబుల్ నిచ్చెన, అంబులెన్స్‌లతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. లోపలి చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న దుకాణాలు, పార్క్ చేసిన వాహనాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. వివిధ ఫ్లోర్లు, టెర్రస్‌పై అనేక మంది చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేపట్టామని అధికారు తెలిపారు.