ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు తల్లులకు కడుపుకోతను మిగిల్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన ఇద్దరు నవజాత శిశువులను మెరుగైన వైద్యం కోసం సమీపంలో ఉండే ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని ఫోటోథెరపీ యూనిట్‌లో ఉంచగా.. ఆ క్లినిక్ యజమాని ఆ పిల్లలున్నారనే ఇంగితం లేకుండా తన సుఖాన్ని చూసుకున్నాడు. హాయిగా నిద్రపోవడానికి ఏసీని ఆన్ చేసి.. రాత్రంతా ఉంచాడు. దీంతో ఆ చిన్నారులు చలికి ప్రాణాలు కోల్పోయారు.



ఓ వైద్యుడి బాధ్యతారాహిత్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలను హరించింది. నిద్రకు ఎటువంటి ఆటంకం ఉండకూడదని ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు చనిపోయారు. దారుణమైన ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి కారణమైన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కైరానా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌కు తరలించారు. చిన్నారులను ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని క్లినిక్ డాక్టర్‌ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని ఆన్ చేశారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు అక్కడ వెళ్లేసరికి.. విగతజీవులయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చిన్నారుల కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదుచేసినట్టు కైరానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేత్రపాల్ సింగ్ తెలిపారు. డాక్టర్ నీతును అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య శాఖ దీనిపై విచారణకు ఆదేశించింది.

అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వనీ శర్మ మాట్లాడుతూ.. ఈ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు, మెడికల్ డిగ్రీ, లైసెన్స్ లేకుండా డాక్టర్ నీతు క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించామని చెప్పారు. క్లినిక్‌ను సీల్ చేశామని, వైద్యుడిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం సెక్షన్ 15 (2,3) కింద కేసు నమోదుచేశామన్నారు.