గతేడాది ఓ సివిల్ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. వాటిని కొట్టివేసింది. కానీ, ఈ ఉత్తర్వులను తమ అనుకూలంగా ఇచ్చినట్టు మార్చేశారు. ఈ విషయం కోర్టు నోటీసుకు రావడంతో అంతర్గత విచారణ చేపట్టింది. అందులో తమ ఆదేశాలను మార్చేసినట్టు వెల్లడి కావడంతో జడ్జిలు షాకయ్యారు. దీంతో పోలీసు కేసు పెట్టి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువరించారు. ఇది ప్రస్తుతం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమంగా మారింది.


ఓ సివిల్ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ఉత్తర్వులను మార్చేసిన (Fabrication) ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము ఇచ్చిన ఉత్తర్వులనే మార్చేయడంతో ధర్మాసనంలోని (Bench) న్యాయమూర్తులు విస్తుపోయారు. సర్వోన్నత న్యాయస్థానం అంతర్గత విచారణలో తమ ఆదేశాలను మార్చేశారని తేలడంతో పోలీసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. అంతేకాదు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ అభయ్ ఎస్‌ ఓకా (Justice AS Okhla), జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ (Justice Pankaj Mittal) లతో కూడిన ధర్మాసనం రిజిస్ట్రార్‌ను ఈ మేరకు ఆదేవాలు జారీచేసింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేలా పోలీసు అధికారికి సూచించాలని పేర్కొంది.

ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది ప్రీతి మిశ్రాను విచారణకు హాజరు కావాల్సిందిగా తాము ఆదేశించామని, ఆమె రాలేదని ధర్మాసనం గుర్తు చేసింది. న్యాయవాది పాత్రపై పోలీసు విచారణ జరగాలని స్పష్టం చేసింది. పిటిషన్‌తోపాటు రెండు వేర్వేరు ఉత్తర్వులను జత చేయడాన్ని ధర్మాసనం తొలుత గుర్తించింది. మొదటి ఆదేశాల్లో పిటిషన్‌ను డిస్మిస్‌ చేసినట్లుగా.. రెండోది అనుమతించినట్లుగా ఉంది.

దీంతో అంతర్గత విచారణకు ధర్మాసనం గతంలో ఆదేశించింది. తమ ఆదేశాలను మార్చినట్లు తేలడంతో పోలీసు కేసు పెట్టాలని సూచించింది. దీంతో సంబంధమున్న న్యాయవాదులు ప్రీతి మిశ్రా, అఫ్తాబ్‌ అలీఖాన్‌లతోపాటు పిటిషనర్ మనిష్ మదన్‌మోహన్‌కు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రకు చెందిన మనీశ్ మదన్‌‌మోహన్ అగర్వాల్ ఓ సివిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి తరఫున న్యాయవాది ప్రీతి మిశ్రా పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మిట్టల్‌ల ధర్మాసనం.. 2020 జులై 25న పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, ఆగస్టులో కోర్టు ఉత్తర్వులు ఫోర్జరీ అయినట్టు న్యాయమూర్తులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌కు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జతచేయడాన్ని గమనించారు. అసలు ఆర్డర్ పిటిషన్‌ను కొట్టివేసిట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గుర్తించారు. నివేదికను బుధవారం కోర్టుకు సమర్పించగా.. న్యాయవాది ప్రీతి మిశ్రా మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆమె పాత్రపై కూడా విచారణ జరిపించాలని ధర్మాసనం ఆదేశించింది. గతేడాది జులై 25న పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇస్తే.. అదే ఏడాది ఆగస్టులో మరో ఉత్తర్వులు ఇచ్చినట్టు తీర్పు కాపీలను మార్చేశారని, ఇది అత్యంత తీవ్రమైన చర్య అని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మిట్టల్ వ్యాఖ్యానించారు.