hyderabad Crime : 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మాణిక్ రావు అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి స్పెషల్ సెషన్స్ జడ్జి అనిత శుక్రవారం తీర్పునిచ్చారు.

లైంగికంగా వేధింపులకు గురైన 15 ఏళ్ల బాలిక తన అమ్మమ్మ ఇంటి వద్ద నివాసం ఉంటోంది. సెలవుల్లో బాలిక తన తండ్రి ఇంటికి వెళ్లింది. నిందితుడు మాణిక్యరావు తండ్రి ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బాలిక 4వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మాణిక్యరావు చిన్నారిని అనుచితంగా తాకుతూ దుర్భాషలాడేవాడని తెలుస్తోంది. బాలిక స్నానం చేసి డ్రెస్‌ మార్చుకుంటున్న సమయంలో మాణిక్యరావు ఫొటోలు, వీడియోలు తీసేవాడని ఫిర్యాదులో బాధితురాలు అమ్మమ్మ పేర్కొంది.


అసలేం జరిగింది?


మాణిక్యరావు బాలిక ఫొటోలు, వీడియోలు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు అమ్మమ్మ తెలిపింది. లైంగిక వేధింపుల గురించి బయటపెడితే తండ్రిని, సోదరుడిని చంపేస్తానని మాణిక్ రావు బెదిరించినట్లు తనతో చెప్పేది అని బాధితురాలు అమ్మమ్మ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు... బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసి మాణిక్ రావు పై POCSO చట్టం కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.


20 ఏళ్ల జైలు శిక్ష


నాంపల్లి స్పెషల్ సెషన్ల కోర్టు జడ్జి అనిత పూర్తి వాదనను విన్నారు. ఈ కేసు రికార్డులను విశ్లేషించిన జడ్జి... నిందితుడు చింతల మాణిక్ రావుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. దాంతో పాటు 10,000 జరిమానా కూడా విధించారు. భరోసా కేంద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబానికి పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా బాలికకు వైద్య, ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని సూచించింది.


రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్