వాహనం జాగ్రత్తగా నడపమని చెప్పినందుకు పోలీసోడిపైనే దాడికి దిగారు. తన కారును ఢీకొట్టి వ్యక్తులకు.. ర్యాష్ డ్రైవింగ్ సరికాదని ఆ కానిస్టేబుల్ హితవు పలకడమే నేరమైంది. ఏకంగా తల్లీ కొడుకులు అతడిపై పడి.. చేతికందని వాటితో దాడికి దిగారు. ఢిల్లీ వీధుల్లో మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన.. బాధిత పోలీస్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వాగ్వాదం తర్వాత ఘటనా స్థలి నుంచి వెళ్లిపోతున్న హెడ్‌ను అడ్డగించి మరీ కొట్టారు.

ప్రధానాంశాలు:

  • హెడ్ కానిస్టేబుల్ కారును ఢీకొట్టిన మరో వాహనం
  • సెప్టెంబరు 15 తిలక్ నగర్ వద్ద చోటుచేసుకున్న ఘటన
  • తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు



పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సెప్టెంబరు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిలక్ నగర్ ప్రాంతంలో తన వాహనానికి సమీపంగా వచ్చి ఢీకొట్టిన కారులోని వ్యక్తులకు.. జాగ్రతగా బండి నడపండని కానిస్టేబుల్ చెప్పడంతో వారు రెచ్చిపోయారు. ఆయనపై ముగ్గురూ ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. బాధిత కానిస్టేబుల్ ఎంజీ రాజేశ్ (50) ఫిర్యాదు ప్రకారం.. తన వాహనాన్ని ఓ కారు ఢీకొట్టిడంతో.. అందులో మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారని తెలిపారు.

అజాగ్రత్తగా వాహనం నడపొద్దని వారికి సూచించడంతో కొద్దిసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే ముగ్గురూ వెంబడించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకుని, కారులో నుంచి లాగేశారు. అక్కడ ఉన్న ఇటుకలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. కారును కూడా ధ్వంసం చేశారు.

‘ఓ వ్యక్తి ఇటుక తీసుకుని నా కారు అద్దాలను పగలగొట్టాడు. అతడే తనను బండిలో నుంచి లాగేసి, ఇష్టమొచ్చినట్టు దాడిచేశాడు’ అని ’ అని హెడ్ కానిస్టేబుల్ ఆరోపించారు. వారిని పక్కకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే మహిళ ఇటుకతో దాడి చేసింది.. ఆమె సోదరుడు నాపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాడు. కానిస్టేబుల్ గాయపడటంతో ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారు.

కానిస్టేబుల్ కుమారుడు మాట్లాడుతూ.. స్పృహ‌త‌ప్పి పడిపోవడంలో ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారని, అటుగా వచ్చిన ఓ వ్యక్తి తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారని అన్నారు. ప్రస్తుతం మహారాజా అగ్రసేస్ ఆస్పత్రిలో తన తండ్రి చికిత్స పొందుతున్నాడని తెలిపాడు. హెడ్ కానిస్టేబుల్‌ తలకు తీవ్ర గాయాలైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశామని, మహిళ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఆమెను అరెస్టయిన సోదరులకు తల్లి అని అనుమానిస్తున్నారు.